Friday 21 November 2014

ప్రముఖ తమిళ హీరో విశాల్ పై తమిళ నటీనటుల అసోసియేషన్ నడిగర్ సంఘం మండిపడుతోంది. గత కొంత కాలంగా విశాల్ కు తమిళ నటీనటుల అసోసియేషన్ నడిగర్ సంఘంకు విభేదాలు ఉన్నాయన్న వార్తలకు ఈ సంఘటన బలం చేకూరుస్తోంది. గత ఏడాది కమల్ హాసన్ నటించిన “విశ్వరూపం” సినిమా వివాదం సమయంలో కూడా హీరో విశాల్ నడిగర్ సంఘంపై వివాదాస్పదవ్యాఖ్యలు చేసినట్టు కోలీవుడ్ లో వార్తలు వస్తున్నాయి. అయితే తాజాగా, నటీనటుల సంఘం అధ్యక్షుడు శరత్ కుమార్, సంఘం గురించి విశాల్ చెడుగా మాట్లాడుతున్నాడని, మరొకసారి ఇలా మాట్లాడినట్లైతే, విశాల్ మీద యాక్షన్ తీసుకోవడమే కాకుండా, అతన్ని సంఘం నుంచి తొలగిస్తామని వ్యాఖ్యానించారు.

ఈ విషయం గురించి హీరో విశాల్ స్పందించాడు. శరత్ కుమార్ వ్యాఖ్యలు తనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయని చెప్పాడు. తాను ఎప్పుడూ సంఘం గురించి నెగటివ్ గా మాట్లాడలేదని వివరించాడు. అయితే ఒక్క విషయం శరత్ కుమార్ నుంచి తెలుసుకోవాలని ఉందని, అది తాను ఎప్పుడు, ఎక్కడ సంఘం గురించి చెడుగా మాట్లాడింది వివరించాలని కోరాడు. శరత్ కుమార్ గనక ఆ విషయాలు వివరిస్తే అందుకు తగ్గ వివరణ ఇచ్చుకుంటానని కూడా తెలియజేశాడు విశాల్. అంతేగాని తనని సంఘం నుంచి బహిష్కరిస్తానని అనడం మాత్రం దారుణమని అన్నాడు. ఒకవేళ బహిష్కరించాల్సి వస్తే, నటీనటుల గురించి అవమానకరంగా మాట్లాడిన రాధారవి, ఉపాధ్యక్షులు కెఎల్ కలైలను బహిష్కరించాల్సి ఉంటుందని వ్యాఖ్యానించాడు విశాల్. ఈ వివాదం ఎక్కడివరకు పోతుందోనని కోలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. మరోపక్క, ఈ వివాదంపై శరత్ కుమార్ కుమార్తె వరలక్ష్మి, హీరో విశాల్ ల స్నేహంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి.